వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 29: సాగులో శాస్త్రవేత్తల అవిరళ కృషితో పాటు దేశాలన్నీ కలిసి పని చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా పోషకాహార భద్రతని సాధించగలమని బ్రిటిష్ డిప్యుటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సూచించారు. బుదవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘సుస్థిర అభివృద్ధి సాధించడానికి నవకల్పనలతో కూడి న ఎంటర్ ప్రెన్యూరల్ మార్గాలు’ అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అగ్రి హబ్, గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్, రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంస్థలు ఈ వర్క్షాఫ్ నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి బతకడానికి పోషకాహారం ఎంతో అవసరమని, అందుకు తొలి ప్రాధాన్యం సాగు అనుబంధ రం గాలకు ప్రభుత్వాలు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నందునే ఇక్కడ మంచిఫలితాలు సాధించగలిగారని అన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, దేశానికి రోల్ మాడల్ అని కొనియాడారు.
దేశవ్యాప్తంగా సుమారు 80 వేల స్టార్టప్లు ఉండగా, అందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన 3 వేలు ఉన్నాయని నాబార్డు మాజీ చైర్మన్ చింతర గోవిందరాజులు అన్నారు. పీజేటీఎస్ఏయూ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా రూపుదిద్దుకుంటున్నదని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ సుధీర్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ డీడీజీ డాక్టర్ అరవింద్కుమార్, అగ్రిహబ్ ఎండీ డాక్టర్ కల్పనాశాస్త్రి, సీఈవో విజయ్కుమార్, వర్సిటీ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.