హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కౌమార బాలికల్లో పౌష్టికాహార లోపా న్ని అధిగమించేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టులోభాగంగా రాష్ట్రంలోని 11 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల 10 వేల మంది కౌమార బాలికలకు ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కిట్లలో నెలకు 25 రోజుల చొప్పున సంవత్సరంలో 300 రోజులకు సరిపడా అత్యంత పోషక విలువలున్న సమతుల ఆహా రం ఉంటుంది.
సంవత్సరానికి మూడు విడతలుగా కిట్ల పంపిణీ చేపట్టేందుకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కేంద్రా ల పరిధిలో నిర్దేశిత వయసున్న కౌమార బాలికల్లో బడికిపోని వారిని గుర్తించి, వారి ఆరోగ్య స్థితిగతులను అంచనావేసి 10 వేల మందిని ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన వారికి 100 రోజులకు సరిపడా సమతుల పోషక ఆహార కిట్లను అందించే ప్రక్రియ మొదలుపెట్టింది. గోధుమపిండి, నెయ్యి, డేట్స్, ప్రొటీన్ బిస్కట్స్, ఐరన్, జింక్ టానిక్, క్యాల్షియం ట్యాబెట్లను ప్యాక్చేసి పంపిణీ చేస్తున్నది.