హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటూ కొన్నాళ్లుగా హడావుడి చేస్తున్న ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీలక్ష్మీరెడ్డికి షాక్ తగిలింది. భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అమెరికా పౌరురాలైన ఝాన్సీ.. తాను 2022 జూన్ 16 నుంచి భారత్లోనే నివాసం ఉంటున్నానని, తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉంటున్నట్టు పేర్కొన్నారు. ఈ దరఖాస్తుపై విచారణ జరుపాలని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్కు పంపింది. ఈ మేరకు విచారణలో ఝాన్సీలక్ష్మీరెడ్డి జూన్ 16 తర్వాత అమెరికా పాస్పోర్ట్తో పలుమార్లు ఆ దేశానికి వెళ్లి వచ్చినట్టు తేలింది.
పౌరసత్వ నిబంధనల ప్రకారం ఎన్నారైలు కనీసం ఏడాదిపాటు భారత్లో నివాసం ఉండాలి. కానీ ఆమె పలుమార్లు అమెరికాకు వెళ్లారని, భారత్కు టూరిస్ట్గా వచ్చి వెళ్లినట్టు విచారణలో తేలింది. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ఈ నెల 4న హైదరాబాద్ కలెక్టర్ లిఖితపూర్వకంగా రిజిస్టర్ పోస్టు ద్వారా ఝాన్సీకి పంపించారు. ఝాన్సీ వ్యవహారంపై పాలకుర్తిలో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. తప్పుడు సమాచారంతో భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, అయినా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రచారం చేసుకున్నారని పలువురు మండిపడుతున్నారు. దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందని తెలిసినా, మాయ మాటలతో కాంగ్రెస్ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్కే చెందిన ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, ఇతర నేతలు ఆమెకు పౌరసత్వం లేదని చెప్పినా వినకుండా తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తుతున్నారు. మూడు నెలలుగా పాలకుర్తిలో ఝాన్సీ చేసిన హడావుడి, తాజా పరిణామాలతో నియోజకవర్గ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.