హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): విపత్తులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో సమర్థంగా విధులు నిర్వర్తించినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. రెండు రోజుల్లో 26 రెస్క్యూ కాల్స్ అందుకొని 1,518 మందిని రక్షించినట్టు తెలిపారు. 4 మృతదేహాలను గుర్తించి వెలికి తీశారని, ఇండ్లలో చేరిన నీటికి బయటికి పంపేందుకు సేవలందించినట్టు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని భవనాలు, ఇండ్లలో ఉన్న 1,393 మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించినట్టు వెల్లడించారు. గురు, శుక్రవారాల్లో ప్రమాదకర వరదల్లో చిక్కుకున్న 121 మందిని, 5 ఆవులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్టు తెలిపారు. రెండ్రోజుల్లో మొత్తం 18 బృందాలు రేయింబవళ్లు పౌరులను కాపాడేందుకు విశేష కృషి చేశాయని కొనియాడారు.