ప్రత్యేక రైలు నడిపించిన ద.మ.రైల్వే
గజ్వేల్ ప్రజల చిరకాల కోరిక సాకారం: ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్/మనోహరాబాద్, ఏప్రిల్ 26: కాచిగూడ నుంచి సిద్దిపేట జిల్లా కొడకండ్ల వరకు రైల్ కూత పెట్టింది. కాచిగూడ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపారు. మద్యాహ్నం 3: 22కు రైలు గజ్వేల్ రైల్వేస్టేషన్కు చేరుకున్నది. మనోహరాబాద్ నుంచి కొడకండ్ల వరకు 43 కిలోమీటర్ల రైల్వేమార్గం పూర్తికావడంతో త్వరలో ఈ మార్గంలో రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అతిత్వరలో ఈ మార్గంలో గూడ్స్ , సాధారణ రైలు ప్రయాణ సేవలను అందుబాటులోకి తేనున్నట్టు రైల్వే ఇంజినీరింగ్ అధికారి సోమనాథ్ తెలిపారు. రైలు వస్తుందన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు అధికసంఖ్యలో గజ్వేల్ స్టేషన్కు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైలు ప్రయాణాన్ని సాకారం చేశారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం రైలులో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ప్రజలతో కలిసి కొడకండ్ల వరకు ప్రయాణించారు.