హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ పరిధిలో 24 డిప్యూటీ ఈవో/గ్రేడ్-1 హెచ్ఎం పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 10, మల్టీజోన్-2లో 14 చొప్పున పోస్టులున్నాయి. మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూలై 19 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.
పీజీ ప్రవేశాల దరఖాస్తుకు 10 వరకు గడువు
హనుమకొండ చౌరస్తా, జూన్ 5: 2026-27 విద్యాసంవత్సరానికి వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘టీజీ సీపీగెట్-2026’ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నదని టీజీ సీపీగెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో, 18 వరకు రూ.2 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదని సూచించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే queries-tgcpget26@ gmail.comకు ఈ-మెయిల్ పంపవచ్చని, కార్యాలయ సమయాల్లో 0870-2934285 నంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు. ఇప్పటివరకు వివిధ పీజీ కోర్సులకు 23,916 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు రాజేందర్ పేర్కొన్నారు.