హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు ఏమాత్రం తీసిపోకుండా బలోపేతం చేశామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. రెండు రోజుల్లో 1,140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని,10 రోజుల్లో పీహెచ్సీలకు 1,000 మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. త్వరలో మరో 140 మంది మిడ్వైఫరీలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. నిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన ‘హాస్పిటల్ ఇన్ఫెక్షన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అంతకుముందు దవాఖానలోని వార్డుల్లో కలియ తిరుగుతూ రోగులు, వారి సహాయకులతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిమ్స్ వేదికగా హాస్పిటల్ ఇన్ఫెక్షన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ రేటు 7 శాతంగా ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో10 శాతంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటును తగ్గించేందుకు త్రీ-టైర్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు వివరించారు. ఇందుకోసం ప్రతి దవాఖానలో సూపరింటెండెంట్, మైక్రో బయాలజీ హెచ్వోడీ, నర్సింగ్ హెచ్వోడీతో కమిటీ వేసినట్టు తెలిపారు. ప్రతి సోమవారం ఈ కమిటీ సమావేశమై, చర్చిస్తుందని తెలిపారు. అదనంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్గా ఒక వైద్యుడిని, స్టాఫ్ నర్స్ను నియమించామని.. వీరికి ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ ఇస్తామన్నారు. ముందుగా బోధన వైద్యకళాశాలల సిబ్బందికి, తరువాత వైద్యవిధాన పరిషత్కు, అనంతరం పీహెచ్సీ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కార్పొరేట్ల కంటే తక్కువ కాదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కార్పొరేట్లో పనిచేసే పేరున్న వైద్యుల్లో ఎక్కువమంది గవర్నమెంట్ వైద్యకళాశాలల్లో చదివి, గవర్నమెంట్ దవాఖానల్లో ప్రాక్టీస్ చేసిన వారేనని తెలిపారు. రాష్ట్రం వచ్చాక దవాఖానల్లో సమస్యల సత్వర పరిష్కారం కోసం సూపరింటెండెంట్లకే భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. రూ.20 కోట్లతో ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఒక్క ఫోన్కాల్ చేస్తే వైద్య పరికరాలకు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎంఎంఆర్, ఐఎంఆర్ (మాతా శిశు మరణాలు) రేటు గణనీయంగా తగ్గిందని, ఎంఎంఆర్లో తమిళనాడును దాటి 2వ స్థానానికి చేరుకొన్నామని తెలిపారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, తప్పుచేసినవారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.