హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కంట్రీ డిలైట్ సంస్థ చేస్తున్న మోసం బట్టబయలైంది. అనుమతులు లేకుండానే రాష్ట్రంలో నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నట్టు తేలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా కోట్లల్లో వ్యాపారం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండింగ్ మాటున చేస్తున్న ఈ దందాను రాష్ట్ర ఆహార నాణ్యతా ప్రమాణాల విభాగం బయటపెట్టింది. సంగారెడ్డిలోని ప్లాంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు శనివారం తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకానికి ఎఫ్ఏఎస్ఎస్ఏఐ నుంచి అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. రూ.52 లక్షల విలువ చేసే 1,500 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి, కంట్రీ డిలైట్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఫార్మ్ టు హోమ్, తాజా ఉత్పత్తులు అంటూ ప్రచారం చేస్తూ, నిల్వ చేసిన నెయ్యిని వినియోగదారులకు అంటగడుతున్న విషయం తేలింది.