హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరికి కరువుభత్యం (డీఏ) మాత్రమే కాదు; డీఏ బకాయిలు కూడా అందడంలేదు. డీఏలు పెండింగ్లో పెట్టిన సర్కార్ డీఏ ఎరియర్స్ను కూడా పెండింగ్లో పెట్టింది. ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏలను రెండేండ్లు ఆలస్యంగా మంజూరుచేస్తున్న ప్రభుత్వం.. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లిస్తామన్న బకాయిలను కూడా సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేయడంలేదు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా సీపీఎస్ ఉద్యోగులున్నారు. ఎరియర్స్ను జమ చేయకపోవడంతో వీరంతా రూ.వెయ్యికోట్ల వరకు నష్టపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు డీఏలను విడుదల చేసింది. అయితే, ఇవి ఎప్పుడో ఇవ్వాల్సినవి.
ప్రతి డీఏనూ సర్కార్ రెండేండ్లు ఆలస్యంగా ఇస్తున్నది. అయితే, వీటిని బకాయి పడిన తేదీ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. వీటినే డీఏ బకాయిలంటారు. ఈ మూడు డీఏ ఎరియర్స్ కోసం సీపీఎస్ ఉద్యోగులు ప్రతి నెలా మూడు బిల్లులు తయారుచేసి, సబ్ట్రెజరీ ఆఫీసుల్లో సమర్పిస్తున్నారు. కానీ, డీఏ ఇన్స్టాల్మెంట్ కూడా తమ ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇంతకుముందు రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలుంటే, అన్ని వాయిదాలు ఒకేసారి చెల్లించేవారు. కానీ, ఇప్పుడు ఆ వెసులుబాటును కూడా తొలగించారు. 2023 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఇవ్వాల్సిన బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించాలనే నిబంధన చేర్చి, సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారట. దీనిపై సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఇదీ పరిస్థితి
క్రమం తప్పకుండా చెల్లించాలి: టీఎస్ సీపీఎస్ యూనియన్
డీఏ ఎరియర్స్ను పెండింగ్లో పెట్టడం అత్యంత దారుణం టీఎస్ సీపీఎస్ యూనియన్ పేర్కొన్నది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఎరియర్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇకనుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా ఎరియర్స్ను ఖాతాల్లో జమ చేయాలని కోరింది. జనవరి 2024 నుంచి ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నది.