న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2022-23పై ఇవాళ రాజ్యసభలో సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను నిరాశపరిచిందన్నారు. 90 నిమిషాల మంత్రి ప్రసంగం 90 కోట్ల మందిని వెలివేసిందన్నారు. మన్రేగాకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామీణ కార్మికుల్లో విశ్వాసాన్ని ఎందుకు నింపడం లేదన్నారు. గ్రామాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడానికి కొన్ని చర్యలు తప్పవన్నారు. మిస్ యూజ్ అవుతుందన్న భయాందోళనలను తొలగించాల్సి ఉందన్నారు. మన్రేగాను వ్యవసాయ రంగంతో లింకప్ చేయాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారని, దీని ద్వారా మిస్ యూజ్ అవుతుందన్న అనుమానాలు నివృత్తి అవుతాయని, అందుకే వ్యవసాయ రంగంతో మన్రేగాను లింక్ చేయాలని ఎంపీ సురేశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఇదో మంచి అవకాశం అన్నారు.
గతంలో దుబాయ్కు వెళ్లే వారంతా ఇప్పుడు గ్రామాల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఉంటుందని రైతులకు హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డిమానిటైజేషన్, జీఎస్టీ ద్వారా ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్నట్లు సురేశ్ రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో రుణం ఇవ్వనున్నట్లు కేంద్రం చెప్పిందని, కానీ రుణాలపై వడ్డీని తొలగించాలని ఆయన కోరారు. డిజిటలైజేషన్ ప్రక్రియను స్వాగతిస్తున్నామని, కానీ కొన్ని ఆందోళనలు ఉన్నాయన్నారు.
ఏపీ విభజనపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను డిస్టర్బ్ చేశాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం మేం 14 ఏళ్లు ఉద్యమం చేశామన్నారు. తెలంగాణ బిల్లు హౌజ్లో పాసైందంటే, అదే పాసైనట్లే అని, ఎందుకుంటే పార్లమెంటే సుప్రీమన్నారు. సభలో తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు పాసైన విధానంపై ప్రధాని మోదీ ప్రశ్నలు లేవనెత్తడం సరికాదు అన్నారు. హౌజ్లో పాసైన బిల్లుపై ప్రశ్నించే అధికారం ప్రధానికి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ తెలిపారు. విభజన వల్ల మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా అని ప్రధాని మోదీని అడిగారు. ఒకవేళ వచ్చి ఉంటే మరెందుకు మేం అడిగిన డిమాండ్లను పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ నుంచి డిమాండ్లు వస్తున్నా.. వాటిని పరిష్కరించడం లేదని, ఆ డిమాండ్లను తిరస్కరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏదో దురుద్దేశంతో మోదీ రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేసినట్లు సురేశ్ రెడ్డి పేర్కొన్నారు.