హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దూర విద్య స్టడీ సెంటర్ల తీరు వల్ల నేడు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యూజీసీ నిబంధనలు బేఖాతరు చేస్తూ, ఇష్టారీతిన నడుస్తుండటంతో అందులో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి, దూర విద్య స్టడీ సెంటర్లను ఆయా యూనివర్సిటీ పరిధి దాటి ఏర్పాటు చేయరాదు. సర్టిఫికెట్లు జారీ చేయరాదు. ఇవి డిస్టెన్స్ ఎడ్యుకేషన్పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 2013లో జారీచేసిన నిబంధనలు. కానీ, ఈ నిబంధనలను అతిక్రమించి పలు స్టడీ సెంటర్లు ఇష్టారీతిన పీజీ, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు చేసుకొన్నాయి. పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీచేశాయి. కాని ఇప్పుడు ఆ స్టడీ సెంటర్లను నమ్మి మోసపోయిన విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. చేతిలో సర్టిఫికెట్ ఉన్నా వినియోగించుకోలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా స్టడీసెంటర్ల పాపం.. నేడు విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
తప్పుదోవ పట్టించి..
నిబంధనలు అడ్డుగా ఉన్నా.. స్టడీ సెంటర్ల నిర్వాహకులు అభ్యర్థులను తప్పుదోవ పట్టించారు. పదేండ్ల వరకు ఏపీ, తెలంగాణలో విద్యావకాశాలు సమానంగా ఉంటాయని మోసపుచ్చి అడ్మిషన్లు చేసుకొన్నారు. విద్యార్థులు ఇది నిజమనుకొని కోర్సుల్లో చేరారు. వీరి నుంచి ఫీజుల రూపంలో వేలల్లో వసూలు చేశారు. పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీచేశారు. వీటిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్లే అధికంగా ఉన్నాయి. కోదాడ, దేవరకొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, భువనగిరి, హైదరాబాద్లోని ఈసీఐఎల్ ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించి పెద్ద ఎత్తున డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇప్పుడా సర్టిఫికెట్లు చెల్లుబాటు కావటం లేదు. నిబంధనలు అతిక్రమించి అడ్మిషన్లు తీసుకోవటంతో అభ్యర్థులను టీఎస్పీఎస్సీ దరఖాస్తుకు అనుమతించటం లేదు. జూనియర్ లెక్చరర్ సహా ఇతర ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలోనే తిరస్కరిస్తున్నది. దీంతో ఆయా అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బాధితులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కలిసి గోడు వెల్లబోసుకోవటంతో.. మానవతాదృక్పథంలో మినహాయింపు ఇవ్వాలని యూజీసీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.