కవాడిగూడ, జూలై 29: గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రీజినల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్బీ) ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలిండియా ఇన్సూరెన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మిశ్రా మాట్లాడుతూ.. 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంక్గా ఏర్పాటు చేయాలన్నారు. మిత్రీ కమిటీ రిపోర్టు ప్రకారం కొత్త నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
దినసరి వేతన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, ఐబీఏ ఆమోదించిన 11వ వేతన ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. కొత్త పెన్షన్ పథకాన్ని రద్దుచేసి, వాణిజ్య బ్యాంకులతో సమానంగా పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ బ్యాంకులు దేశవ్యాప్తంగా 22 వేలకుపైగా శాఖలను కలిగి ఉన్నాయని, దాదాపు 40 కోట్ల మందికి సేవలు అందిస్తున్నాయని ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీ రవికాంత్, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటేశ్, ఎన్ సత్యనారాయణ, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.