‘ఆరేండ్ల కింద ఆవిర్భవించిన తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిన మేలు ఒక్కటి చెప్పండి. ఏం చేసిండ్రని ఓట్లడుగుతరు. ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్రు. ప్రముఖ విద్యాసంస్థలు, కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ప్లాంట్, ట్రైబల్ వర్సిటీ..ఇట్ల ఎన్నో అడిగినం. మస్తు లేఖలు రాసినం. చివరికి చేసింది గుండు సున్నా. రాష్ట్ర విభజన చట్టంలో ఒక్క హామీ నెరవేర్చకుండా ఓట్ల కోసం వస్తున్న బీజేపీ నేతలను పట్టభద్రులు గట్టిగా నిలదీయాలి. ఉద్యోగాల భర్తీపై లెక్కలతో సహా చూపించినం. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవ్వగానే 50 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతం’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ప్రైవేట్ కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సికింద్రాబాద్ ఎస్వీఐటీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
సురభి వాణీదేవిని గెలిపించడం మా కర్తవ్యం. ఓటింగ్లో పాల్గొని మా పీవీ బిడ్డను గెలిపిస్తాం. పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాతనే మాకు పీవీ పూర్తిగా తెలిశారు. ఇప్పటికే పట్టభద్రులమంతా కలిసి తీర్మానించుకున్నాం. “మా ఓటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికే.” అంటూ ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో విద్యావేత్తలు నినదించారు. సికింద్రాబాద్లోని మహబూబ్ కాలేజీలో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి పట్టభద్రులు మద్దతు ప్రకటించారు. ఓటింగ్లో పాల్గొని అధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. టీపీసీఎస్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీఎల్.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ప్రైవేట్ టీచర్లు, ప్రిన్సిపాళ్లు, గ్రాడ్యుయెట్స్ భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్టుగా వివరిస్తూ.. కొనసాగిన కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తన ప్రసంగంలో కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.
కేంద్రం తెలంగాణకు ఇచ్చింది సున్నా అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో అడిగాం.. ఒక్కటి కూడా ఇవ్వలేదంటూ విమర్శించారు. ఎన్ఐడీ అడిగాం.. ఎన్నిచ్చింది? సున్నా.., గురుకులాలు అడిగాం.. ఎన్నిచ్చింది? సున్నా.. స్టీల్ ఫ్యాక్టరీ అడిగాం.. ఎన్నిచ్చింది? సున్నా’ అంటూ మంత్రి కేటీఆర్ తన చూపుడి వేలితో గాల్లో సున్నా అని రాసి మరీ చెప్పడంతో ప్రసంగం ఆద్యంతం ఆలోచింపజేసింది. ట్రైబల్ యూనివర్సిటీ అడిగాం.. ఎన్నిచ్చింది? అని సభికులను ప్రశ్నించగా వాళ్లంతా గట్టిగా గాల్లో సున్నా అంటూ రాసి చూపించి కేంద్రంపై తమ నిరసనను ప్రకటించారు. తెలంగాణపై కేంద్రానికి ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నిస్తూ.. తెలంగాణ ఇండియాలో లేదా? అంటూ మంత్రి బీజేపీపై ద్శజమెత్తారు.
చిక్కడపల్లి, మార్చి 9 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇన్చార్జిలకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేరుగా ఫోన్ చేసి ప్రచారం ఎలా జరుగుతుందని ఆరా తీస్తున్నారు. మంగళవారం గాంధీనగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు, ఓటర్స్ ఇన్చార్జి ఎర్రం శ్రీనివాస్ గుప్తాకు మధ్యాహ్నం మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. మీ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ను కలిశారా.. ఓటర్లు ప్రభుత్వంపై ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ విషయంలో కొంత అసంతృప్తి కన్పించిందని కేటీఆర్కు వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో కేంద్రంపై కూడా ఓటర్లు గుర్రుగా ఉన్నారని వివరించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం తప్పకుండా పీఆర్సీ ఇస్తుందని మంత్రి చెప్పారన్నారు. మరికొంత మంది ఇన్చార్జిలకు కూడా ఫోన్ చేశారని తెలుస్తున్నది.
కరోనా కష్టకాలంలో విద్యాసంస్థలు నష్టాల్లో ఉన్నా.. సిబ్బందికి జీతాలు ఇచ్చామని విద్యాసంస్థల ప్రెసిడెంట్ పీఎల్.శ్రీనివాస్ తెలిపారు. కాగా మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. “వాస్తవాలు మాట్లాడుకోవాలి. అందరికి అర్దమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే లాక్డౌన్ కాలంలో సోషల్ మీడియాలో వేలాది మంది ప్రైవేట్ టీచర్లు తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి మీ అందరికి విద్యా సంస్థలు జీతాలు ఇచ్చాయా? ” అని సభికులను అడగ్గా వారంతా లేదని చెప్పడంతో ఆ విషయం తనకు తెలుసని అన్నారు. దీంతో ప్రైవేట్ టీచర్లు ఉద్వేగానికి లోనయ్యారు. తమ సమస్యలను ఇంత క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న నాయకుడు లేరని సభికులు నినాదాలు చేశారు. లాక్డౌన్లో ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలేకపోయింది? కారణాలు ఏంటీ? అని మంత్రి కేటీఆర్ వివరించారు. లెక్కలతో సహా కేటీఆర్ చేసిన ప్రసంగంతో పట్టభద్రులందరూ ఫిదా అయ్యారు. తమ ఓటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికేనంటూ సభా వేదికగా ప్రకటించారు.
కేటీఆర్ ప్రసంగంతో మాకు అపోహలు తొలగిపోయాయి. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది సున్నా అని తెలిసింది. కొత్త రాష్ర్టాన్ని అభివృద్ధిలో అన్ని రాష్ర్టాల కంటే ముందుండేల నడిపించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. – తనుజ, విద్యావేత్త. బోడుప్పల్
వాణీదేవి గెలుపు తెలంగాణ చరిత్రలో మలుపుగా మారబోతుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె పోటీలో ఉండటమే ఎమ్మెల్సీ హోదాకు వన్నె తెచ్చిన వారయ్యారు. దేశానికి సేవలందించిన పీవీకి సొంత పార్టీయే మోసం చేసింది. కానీ నేడు స్వరాష్ట్రంలో పీవీ ఖ్యాతిని నలుదిశలా చాటుతుంది తెలంగాణ ప్రభుత్వం. – పీఎల్.శ్రీనివాస్, టీపీసీఎస్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్
వేలాది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత పీవీ బిడ్డది. గ్రాడ్యుయెట్ల సమస్యలు తెలిసిన వ్యక్తి. విద్యాసంస్థల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కారిస్తారని నమ్ముతున్నాం. మా ఓటు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికే. ఇతరుల మాయ మాటలు మేం నమ్మబోం. -వనజ, ప్రిన్సిపాల్, అక్షరవాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్.
పీవీ కూతురు.. టీఆర్ఎస్ అభ్యర్థి కావడమే ఆమె బలం కాదు.. స్వతహాగా ఆమె విద్యావేత్త. అపారమైన జ్ఞానం ఉన్నది. ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేస్తారు. గతంలో ఎన్నుకున్న వాళ్లు చేసిందేమీ లేదు. మాకు స్పష్టమైన అవగాహన ఉంది. మా ఓటు వాణీదేవీకే. -రోస, హెడ్ మాస్టర్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, కీసర
అధ్యాపక వృత్తిలో ఉన్న వారికి ప్రతి సమస్యపై అవగాహన ఉంటుంది. స్వయంగా అధ్యాపకురాలు కూడా. గ్రాడ్యుయెట్ల సమస్యలు, ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు, విద్యాసంస్థల కష్టాలు వాణీదేవికి తెలుసు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. విద్యావేత్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు. – శైలజా రెడ్డి, ప్రిన్సిపాల్, పల్లవి ఇంటర్నేషనల్ హై స్కూల్, బోయిన్పల్లి.
పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే ఏకైక వ్యక్తి పీవీ కూతురే. ఆమె ఆలోచనలన్నీ అభివృద్ధిమీదనే ఉంటాయి. ఇతరుల లాగా మోసపూరిత రాజకీయాలు తెలియని తత్వం. మాకు ఆమెపై వందశాతం నమ్మకముంది. పీవీ గారి కూతురిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి అందరికి సుపరిచితురాలు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆమెకు వాళ్ల నాన్నగారే ఆదర్శం. గొప్ప చరిత్ర ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన వాణిని మేం ఎమ్మెల్సీగా గెలిపించుకుంటాం. -సిమినాగి, విద్యావేత్త, అల్వాల్
లాక్డౌన్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయం. అన్ని వర్గాల వారిని ఆదుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం. పట్టభద్రులంతా తీర్మానం చేసుకున్నారు. పీవీ కూతురికి మంచి అవకాశం ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు. -మీతాలియా అర్చిత్, విద్యావేత్త