హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనే పాజిటివిటీ రేటు 10 శాతం మించలేదని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనం గుమికూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు విధించామన్నారు.
పాజిటివిటీ రేటు మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం ఉండగా, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం ఉందని వెల్లడించారు. ఇక జీహెచ్ఎంసీలో 4.26 శాతం, మేడ్చల్లో 4.22 శాతంగా ఉందన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ పడల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని చెప్పారు.
వారం రోజులుగా రోజుకు లక్షకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే జరుగుతున్నదని, మూడు రోజుల్లోనే 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామన్నారు. 15 నుంచి 18 ఏండ్లలోపువారిలో 59 శాతం మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించారు.