నిర్మల్, జూన్ 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి.. సర్పంచ్లకు ప్రభుత్వం నయా పైసా బాకీ లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో హనుమాన్ తండాలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని, అయినప్పటికీ ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ, గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని మంత్రి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. గుజరాత్లో తాగు, సాగు నీటికి జనం కష్టాలు పడుతున్న విషయం రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలియక పోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ కింద ఒక్కో వ్యక్తికి 100 లీటర్ల సురక్షిత నీటిని అందిస్తుండగా, గుజరాత్లో ఒక వ్యక్తికి 40 నుంచి 50 లీటర్ల నీరు కూడా అందడం లేదన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు అందకుండా కేంద్రం అడ్డు పడుతున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. అర్హులైన గిరిజనులకు త్వరలోనే పోడు భూములకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన వారి జాబితాను రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.