హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి బీసీ అయి నా బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీల అభివృద్ధికి ఒక్క అంశం కూడా లేకపోవడం శోచనీయమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు. 76 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో 70 కోట్ల మంది బీసీ ప్రజల వాటా బీసీలకు ఇవ్వరా? అని ఆదివారం ఒక ప్రకటనలో కృష్ణయ్య ప్రశ్నించారు.
ఇది ప్రజాస్వామ్య దేశం.. బీసీలు బిచ్చగాళ్లు కాదు.. వాటాదారులు అని, వాటా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదు అని హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ బీసీల అనుకూల వైఖరి అవలంభించి, బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలకు జాతీయ స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, సాలర్షిప్ ప్రవేశపెడతామని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఏటా రెండు లక్షల కోట్ల బడ్జెట్ బీసీల అభివృద్ధికి కేటాయిస్తామని ప్రకటించాలని కోరారు.