నేల, పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ముందంజ
‘సేవ్ సాయిల్’లో నిరంజన్రెడ్డి
హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): నేల లేనిదే జీవం లేదని, జీవం సాగాలంటే నేలను కాపాడుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇప్పటికే 30శాతం భూమి ఎడారిగా మారిందని, ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మానవ జాతికే ముప్పు అని ఆందోళన వ్యక్తంచేశారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. తెలంగాణ బిడ్డలు మట్టి మనుషులుని, ఈ నేలకోసమే ముందు తరాలు అలుపెరగని పోరాటం చేశాయని చెప్పారు. నేల, పర్యావరణాన్ని కాపాడుకోవడం యూఎన్వో-17 లక్ష్యాల్లో ప్రధానమైనవని పేర్కొన్నారు.
నేలను, పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటున్నదని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి క్యాబినెట్ సమావేశంలోనే పర్యావరణహిత నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. హరితహారం ద్వారా 250 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వర్షపు నీటిని సముద్రంలోకి వెళ్లకుండా ఒడిసి పట్టిన రాష్ట్రం తెలంగాణ అని, భూగర్భ జలాలను పెంచడంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని వివరించారు. ప్రభుత్వ చర్యల వల్ల తెలంగాణ నేలంతా పచ్చబడిందని తెలిపారు. నేల పరిరక్షణకు ఈశా ఫౌండేషన్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని ప్రకటించారు.
ఈశా ఫౌండేషన్, సర్కారు మధ్య ఒప్పందం
ఈ కార్యక్రమంలో సేవ్ సాయిల్ నినాదంలో భాగంగా ఈశా ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మంత్రి నిరంజన్రెడ్డి, సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం సద్గురు, సినీనటి సమంత మధ్య సేవ్సాయిల్, పర్యావరణ పరిరక్షణపై సుదీర్ఘ చర్చా కార్యక్రమం జరిగింది.