వందతులపై చర్యలు తీసుకోండి
లాక్డౌన్ నుంచి పౌల్ట్రీ వాహనాలను మినహాయించాలి
మంత్రి హరీశ్రావుకు ఎంపీ రంజిత్రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, మే 14(నమస్తే తెలంగాణ): చికెన్ తింటే కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఎంపీ, పౌల్ట్రీ బ్రీడర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్రెడ్డి ఆర్థిక మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తిచేశారు. శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కుదేలైన పౌల్ట్రీరంగాన్ని ఈ వదంతులు మరింతగా కుంగదీస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజలు చికెన్ వినియోగాన్ని భారీగా తగ్గించారని, ఫలితంగా ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. గత 14 నెలల్లో మూడోసారి పౌల్ట్రీరంగం కుదేలైందని తెలిపారు. దీనికితోడు ఉత్పత్తి ఖర్చులు 40 శాతానికి పెరిగాయని, ఇది ప్రస్తుత సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వాపోయారు. లాక్డౌన్ నేపథ్యంలో పౌల్ట్రీ వాహనాలను ఆపకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.
కోళ్లకు కరోనా సోకే అవకాశమే లేదు: లక్ష్మారెడ్డి
కోళ్లకు కరోనా సోకే అవకాశమే లేదని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఎక్కడా కూడా కోళ్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాలేదని తెలిపారు. వదంతులను నమ్మొద్దని సూచించారు. వాస్తవానికి కరోనా సమయంలో రోగ నిరోధకశక్తి పెంచుకొనేందుకు చికెన్, గుడ్లు ప్రధానమార్గాలని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలపై పశు సంవర్ధక అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వదంతులు ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.