MBBS | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సు ఏ-క్యాటగిరీ సీట్లకు రూ.60 వేలు, బీ-క్యాటగిరీ సీట్లకు రూ.11.55 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.14 లక్షల ఫీజును తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఫీజుల సవరణకు సంబంధించిన ప్రతిపాదనలను టీఏఎఫ్ఆర్సీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. ఏ- క్యాటగిరీ ఫీజులు దాదాపు పాతవే కొనసాగించాలని ప్రతిపాదించారు. బీ-క్యాటగిరీ ఫీజులు రెండు కాలేజీల్లో తగ్గించగా, మరో రెండు కాలేజీల్లో కాస్త పెరగనున్నాయి. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే మూడు, నాలుగు రోజుల్లోనే జీవో జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. 2023-26 విద్యా సంవత్సరాలకు మెడికల్ ఫీజులను ఖరారు చేసేందుకు టీఏఎఫ్ఆర్సీ ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 23 మెడికల్, 12 డెంటల్ కాలేజీలు తమ విద్యాసంస్థలకు చెందిన ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తోపాటు, ఫీజుల సవరణకు ప్రతిపాదనలను సమర్పించాయి. వాటిని పరిశీలించిన అధికారులు.. ఆడిటర్ల చేత తనిఖీలు చేయించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వాస్తవికంగా 2022-23 విద్యా సంవత్సరంలోనే మెడికల్ కోర్సుల ఫీజులను సవరించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో మినహాయింపునిచ్చారు.