కామారెడ్డి : నిజాంసాగర్ ప్రాజెక్టు ( Nizamsagar ) కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గురువారం సాయంత్రం నీటిపారుదల అధికారులు నాలుగు వరద గేట్ల (Gates) ను ఎత్తి నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఆర్డీవో భుజంగరావు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్కు వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతం నుంచి 26,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1403 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.568 టీఎంసీల నీరు నిలువ ఉందని వివరించారు. నీటి విడుదల కారణంగా నిజాంసాగర్ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటి ప్రధాన కాలువ పరిసర ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.