Nizamabad | నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఆదివారం నాడు రియాజ్ను పోలీసులు పట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి తప్పించుకునేందుకు పోలీసుల గన్ లాక్కోవడంతో ఆత్మరక్షణ కోసం రియాజ్ను కాల్చిచంపారు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు షేక్ రియాజ్ కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకుని బైక్పై తీసుకెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. షేక్ రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సారంగపూర్లోని అటవీ ప్రాంతంలో పడివున్న ఓ పాడుబడిన లారీలో దాక్కుని ఉండగా పోలీసులకు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలు కావడంతో ఆదివారం రాత్రి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
నిజామాబాద్ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. సోమవారం తన పక్కనే ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మరణించాడు.
రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్.. ఏఆర్ పోలీసుల గన్ను లాక్కున్నాడని తెలిపారు. ఆ గన్తో పోలీసులపై కాల్పులు జరపబోయాడని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు.