ఆరు నెలలుగా మారణాయుధాలపై శిక్షణ
పీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మరో ఇద్దరు అరెస్టు
నిజామాబాద్ క్రైం, జూలై 6: కరాటే (మార్షల్ ఆర్ట్స్) శిక్షణ ముసుగులో విద్రోహ కుట్రలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)లో పనిచేసిన కొందరితో కలిసి ఏర్పాటు చేసిన పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సంస్థలో దేశాన్ని అస్థిర పరిచేందుకు యువకులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని నిజామాబాద్ పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ ప్రభుత్వం నిషేధించిన పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కొనసాగించేందుకు నిరుపేద, మధ్యతరగతి యువకులకు శిక్షణ ఇస్తున్నది.
ఈ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన జిల్లా కార్యదర్శి సహా ముగ్గురు నిందితులను నిజామాబాద్లో బుధవారం అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కొందరు నిజామాబాద్ రూరల్ మండలంలోని గుడారంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. గ్రామానికి చెందిన షేక్షాదుల్లా ఇంట్లో అతనితోపాటు నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, అబీబ్నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ మోబీన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో షాదుల్లా 2017 నుంచి పీఎఫ్ఐ సంస్థలో జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నాడని తెలిసింది. ఇతర మతస్థుల మీద దాడులతోపాటు అల్లర్లకు పాల్పడటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 200 మందికి కరాటే, మారణాయుధాల వినియోగం, ప్రత్యర్థులపై దాడులు చేయడం లాంటి చర్యలపై శిక్షణ ఇచ్చాడని సీపీ వివరించారు.