నిజామాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, జగిత్యాల జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డు పక్కకుపోయింది. కానీ, ఆ పేరు చెప్పి గెలిచిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ను కొత్త పదవి వరించింది. సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్తోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన బాలశౌరి ఎన్నికైనట్టు మంగళవారం పార్లమెంట్ బులెటిన్ విడుదలైంది. పసుపు బోర్డును అర్వింద్ ఇక శాశ్వతంగా పక్కకు పెట్టేసినట్టు పార్లమెంట్ వేదికగా నిరూపితమైంది. ఈ విషయం తెలుసుకొన్న ఆ ప్రాంత రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. స్పైసెస్ బోర్డు కార్యాలయంతో పసుపు పంటకు పైసా లాభం లేదని, కానీ ఎంపీ అర్వింద్ అదే పదివేలు అంటూ కొత్త పదవులు తెచ్చుకొంటున్నారని మండిపడుతున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా ఇక పసుపు రైతులతోపాటు మిర్చి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని అర్వింద్ కొత్త పల్లవి ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు.
తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు పసుపుబోర్డు తెస్తానని, లేదంటే తన పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి పోరాటం చేస్తానని ఎన్నికల సమయంలో అర్వింద్ పసుపు రైతులను నమ్మబలికాడు. ఒకడుగు ముందుకేసి వంద రూపాయల బాండ్ పేపర్కూడా రాసి ఇచ్చాడు. ఇదంతా నిజమేననుకొని నమ్మిన అన్నదాతలు ఓట్లు వేయడంతో 2019లో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందాడు. ఆ తర్వాత పసుపు బోర్డు ఊసే ఎత్తలేదు. రైతులు పదేపదే నిలదీయడంతో 2020లో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని తీసుకొచ్చి పసుపు బోర్డుకంటే ఇదే బెటర్ అంటూ ఊదరగొట్టాడు. పసుపు బోర్డు కంటే ఎక్కువ పని ఈ కార్యాలయంతోనే జరిగిపోతుందని చెప్పాడు. స్పైసెస్ బోర్డులో సభ్యుడిగా ఎన్నికైనట్టు విడుదల చేసిన తాజా ప్రకటనలోనూ అబద్ధాలే వల్లెవేశాడు. నిజామాబాద్, జగిత్యాల పరిధిలోని పసుపు రైతుల కోసం 2022-2025 కాలానికి స్పైసెస్ బోర్డు ద్వారా రూ.30 కోట్లు ఆమోదింపజేసినట్టు పేర్కొన్నాడు. ఇందులో నుంచి ఇప్పటికే రూ.9 కోట్లు విడుదలైనట్టు ప్రకటించాడు. మరి ఆ మొత్తం ఎందుకోసం వెచ్చించారనేది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయంగా తాను స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం తీసుకొచ్చానని ఎంపీ అర్వింద్ పదేపదే చెప్తున్నాడు. అయితే, ఈ ప్రాంతానికి ఇదేమీ కొత్తకాదు. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీ (2014-2019)గా ఉన్న సమయంలో 2017లోనే ఈ కార్యాలయం మంజూరైంది. వాణిజ్య మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈ కార్యాలయానికి సంబంధించిన ప్రకటన చేశారు. అయితే, కవిత దీన్ని నిర్మొహమాటంగా తిరస్కరించారు. పసుపుబోర్డుకు ప్రత్యామ్నాయం అక్కర్లేదని తేల్చి చెప్పారు. కవిత గతంలో వద్దన్న ఆఫీస్నే అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత పట్టుకొచ్చి తన ఘనతగా చెప్పుకొంటున్నాడు. నమ్మి ఓట్లు వేసిన పసుపు రైతులను దగా చేస్తున్నాడు.
సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా ఎంపికైన అర్వింద్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నోరు తెరిస్తే పచ్చిబూతులు మాట్లాడే అర్వింద్ను సభ్యుడిగా ఎంపికచేసి సుగంధ ద్రవ్యాల బోర్డుకు దుర్గంధం అంటించారని నెటిజన్లు విమర్శనాస్ర్తాలు సంధించారు. పసుపు బోర్డు పేరుతో గెలిచిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాల బోర్డులో ఏం పని? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పసుపు రైతులను మోసం చేసిన అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలని నిజామాబాద్, జగిత్యాలకు చెందిన నెటిజన్లు డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం వల్ల పసుపు రైతులకు పైసా లాభమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తోపాటు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎంపీ అర్వింద్ను నెటిజన్లు కడిగిపారేశారు.