యాదాద్రి, ఆగస్టు 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్య ఆరాధన పర్వాలు పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామునే స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధనలు, నిజాభిషేకం, తులసీ దళాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం, మొక్కు బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవారికి ఉభయ జోడు సేవలు, దర్బార్ సేవలు కొనసాగాయి. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తుల సందడి కనిపించింది. స్వామివారి ఖజానాకు రూ.28,28,212 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. కాగా స్వామివారి సన్నిధిలో వచ్చే నెలలో కోటి పుష్పార్చన నిర్వహించనున్నారు. తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.