నిర్మల్ : ఓ బర్రె మేత కోసం మేడపైకి వెళ్లింది. ఇంటిపై ఉన్న బర్రెను చూసి దాని యజమాని షాక్కు గురయ్యాడు. బర్రెను మెట్ల మార్గం ద్వారా కిందకు దించేందుకు యత్నించాడు. కానీ విఫలమయ్యాడు. దీంతో ఓ భారీ క్రేన్ సాయంతో బర్రెను కిందకు దించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని వెంగ్వపేటలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. వెంగ్వపేటకు చెందిన రైతు శివలింగు తనకున్న బర్రెను ఇంటి ముందు కట్టేసేవాడు. ఇంటిపైకి వెళ్లే మెట్ల వద్ద మేత పెట్టేవాడు. అయితే మేత కోసం బర్రె తన తాడును తెంపేసుకుని, మెట్ల వద్దకు వెళ్లింది. అట్లనే మెట్లను ఎక్కేసి మేడపైకి వెళ్లింది.
ఇక పొద్దున్నే లేచిన శివలింగుకు తన బర్రె కనిపించక పోయేసరికి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అయితే బర్రె పేడ మెట్ల వద్ద కనిపించేసరికి, పైకి వెళ్లి చూశాడు. ఇంటిపైనే బర్రె ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి బర్రెను కిందకు దించేందుకు యత్నించారు. కానీ వీలు కాలేదు.
గ్రామస్తుల సూచనతో బర్రెను కిందకు దించేందుకు ఓ భారీ క్రేన్ను నిర్మల్ నుంచి తెప్పించాడు రైతు శివలింగు. ఇక ఆ భారీ క్రేన్ నాలుగు గంటల పాటు శ్రమించి, మెల్లిగా బర్రెను కిందకు దించింది. మొదటగా బర్రెను తాళ్లతో కట్టేసి, వాటిని క్రేన్కు బిగించి.. దించేశారు. ఈ నాలుగు గంటల సమయానికి కిరాయి రూ. 4 వేలు చెల్లించాల్సి వచ్చింది. బర్రెకు ఎలాంటి హానీ కలగలేదు.