నిర్మల్ : బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్తో పాటు అతని కారు డ్రైవర్ జాఫర్, మధ్యవర్తి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26న బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు షేక్ సాజిద్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. షేక్ సాజిద్పై గతంలో పలు కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీషీట్ తెరిచామని పేర్కొన్నారు.
నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. సాజిద్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మరోవైపు లైంగిక ఘటనను హేయమైన చర్యగా ఖండించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.