కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళిత బిడ్డల్లో కొత్త వ్యాపార అలోచనలకు అవకాశం కల్పిస్తున్నది. శ్రామికులుగా ఉన్న వారు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో పారిశ్రామికులుగా ఎదగడంతోపాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారుల్లో కొందరు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
వినూత్నంగా ఆలోచించి 9 మంది మహిళా లబ్ధిదారులు కలిసి పెట్రోల్బంకు, మరో ముగ్గురు కలిసి రైస్ మిల్లు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయాలు ఈ పథకం కింద కొత్త బాటలు వేస్తుండగా.. సమిష్టిగా నిలిస్తే.. ఇలాంటి ఎన్నో వినూత్న వ్యాపారాలు ప్రారంభించవచ్చంటున్నారు నిపుణులు. ఇప్పటివరకు దళితబంధు కింద టాక్సీలు, ట్రాన్స్పోర్టు వాహనాలు, పొక్లెయిన్స్, సెంట్రింగ్, కిరాణం, టెంట్ హౌస్ లాంటివి పెట్టుకోవడం చూశాం. అయితే వ్యక్తిగత ప్రాజెక్టుల కన్నా.. సమిష్టిగా ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడమేకాదు.. మరి కొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని, దీనికి ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు లబ్ధిదారులు ఆలోచిస్తే బాగుంటుందని ప్రభుత్వం సూచిస్తున్నది. ప్రస్తుతం పదిర గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఇదే మార్గాన్ని ఎంచుకొని బుధవారం మొదటి అడుగువేసి ఆదర్శంగా నిలిచారు.
పదిర గ్రామంలో 18 మందిని దళితబంధు పథకానికి ఎంపిక చేశారు. ఇందులో 9 మంది మహిళా లబ్ధిదారులు పత్రి రాజవ్వ, తెడ్డు లక్ష్మి, రుద్రారపు సునీత, తెడ్డు దేవేంద్ర, తెడ్డు ప్రమీల, తెడ్డు లక్ష్మి, తెడ్డు బాల్లక్ష్మి, తెడ్డు ఎల్లవ్వ, జడల ఎల్లవ్వ ఒక్కమాటపై నిలబడి.. వినూత్నంగా ఆలోచించారు. వ్యక్తిగత ప్రాజెక్టుల కన్నా.. అందరం కలిసి పెట్రోల్బంకు పెట్టుకుందామని నిర్ణయించారు. ఆ మేరకు.. సిరిసిల్ల -కామారెడ్డి రహదారి పక్కన హరిదాస్నగర్ శివారులో కొంత స్థలాన్ని 20 ఏండ్లపాటు లీజుకు తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హెచ్పీ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ఈ బంకుకు మొత్తం రూ.1.20 కోట్లు ఖర్చు అవుతుంది. 9 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన రూ.90 లక్షలు పోనూ ఇంకా రూ.30 లక్షలు అవసరం పడుతున్నాయి. సదరు మహిళలు తమ ఆలోచన విధానాలను జిల్లాకేంద్ర సహకార బ్యాంకుకు వివరించగా.. వారు రూ.30 లక్షల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చారు. మహిళలు తమ అలోచనలను మంత్రి కేటీఆర్తో పంచుకోగా.. ఇతరులకు భిన్నంగా ఆలోచించి ముందుకు వచ్చిన వారిని అభినందించడమేకాకుండా.. బుధవారం పెట్రోల్బంకు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. సదరు కుటుంబాల్లో చాలామంది సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నారు. సఫాయి కార్మికులనుంచి మరికొద్ది రోజుల్లోనే పెట్రోల్బంకు ఓనర్లుగా మారనుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డబ్బులకు మరింత సంపద సృష్టించాలన్నదే తమ తపన అని చెప్తున్నారు.
సీఎం కేసీఆర్ మాకు దళితబం ధు ఇచ్చి పని జేసుకునేందుకు వీలు కల్పించిండ్రు. దళితబంధు తీసుకున్నోళ్లు సానా మంది జీబులు, కార్లే కొంటుండ్రు. అందరూ అవే కొంటే ఎట్లా అని ఆలోచన జేసినం. మేం మా పాలోల్లం 9 మందిమి కలిసి మాట్లాడుకున్నం. ఇప్పుడు ఊర్లల్ల బండ్లు, కార్లు, ట్రాక్టర్లు సానా పెరిగినయి. వాటికి డీజిల్, పెట్రోల్ సానా అవసరం. ఇవన్ని ఆలోచనలు జేసి.. బంకు పెట్టాలనుకున్నం. ఇయాల మంత్రి కేటీఆర్ సార్ పూజజేసిండ్రు. మాకు ఇచ్చిన దళితబంధు పైసలతో బంక్ను మంచిగ నడిపి మేము బతకడమేకాదు.. మా తోటి ఇంకా కొంత మందికి బతుకుదెరువు జూపుతం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లకు రుణపడి ఉంటం.
– తెడ్డు పద్మ, దళత బంధు లబ్ధిదారురాలు
ఎన్నో ఏండ్ల నుంచి ఓటు ఏస్తున్న. మమ్మల్ని ఎవ్వలూ పట్టించుకోలే. సీఎం కేసీఆర్ మా కులమోళ్లకు కష్టాలు ఉన్నాయని గుర్తించిండ్రు. పథకం పెట్టి పైసలు ఇచ్చిండ్రు. మా కులంలో సఫాయి పని జేసుకొని బతుకుతున్నం. కానీ కేసీఆర్ సార్ మాకు పది లచ్చలు ఇచ్చి వ్యాపారం జేసుకొమ్మని పైసలు, ధైర్నం రెండూ ఇచ్చిండు. మా ఊల్లో మేమంతా గలిసినం. బంకు పెడితే బాగుంటందని అందరూ అన్నరు. మేం శానా కష్టపడుతం. అదేదో బంకులోనే కష్టపడుదం అనుకున్నం. ఈ విషయం మాది మాకే వింటే సంతోషం అనిపించింది. మేము కూడా ఇయ్యాల వ్యాపారం జేసే స్థాయికి ఎదిగినం. అవ్వతోడు.. కేసీఆర్కు రుణ పడి ఉంటం.
– పత్రి రాజవ్వ, దళిత బంధు లబ్ధిదారురాలు
పదిర గ్రామనికి చెందిన ఇద్దరు లబ్ధిదారులతోపాటు ఇదే మండలం రంగంపేట గ్రామానికి చెందిన మరో లబ్ధిదారుడు కలిసి రైస్ మిల్లు పెట్టుకోవాలని నిర్ణయించారు. రైస్ మిల్లు ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.3 కోట్లు. ప్రభుత్వం ఇచ్చిన దళితబంధు పోను.. వారి వద్ద ఉన్నది కొంత సమకూర్చుకోగా.. మిగిలింది రుణం ఇవ్వడానికి బ్యాంకు ముందుకొచ్చింది. దీంతో లబ్ధిదారులు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే అదే మండలంలో అక్కపెల్లి వద్ద 2 ఎకరాల స్థలం కొనుగోలు చేయగా.. మిల్లు ఏర్పాటుకు బుధవారం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చిన లబ్ధిదారులను మంత్రి అభినందించారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మా దళిత బిడ్డలు ఆర్థికంగా ఎదగడానికి ప్రవేశపెట్టిన గొప్ప పథకం దళితబంధును ఆదర్శవంతంగా చేయాలని రైస్ మిల్లు నిర్మాణం చేప ట్టాం. దళితబంధు పైసలతో నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్కు బహుమతిగా ఇద్దామని అనుకున్నం. సీఎం కేసీఆర్ చెప్పేదానికన్నా.. పథకం లబ్ధి తీరును పదిరెట్లు ఎక్కువ జేసి చూపాలని రాష్ట్రంలోనే కేటీఆర్ పేరు నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చినం. కేసీఆర్ కు, కేటీఆర్ సార్లకు మా అందరి తరఫున ధన్యవాదాలు.
– సుధమల్ల విజయ్కుమార్, దళితబంధు లబ్ధిదారుడు
మాది మెట్ట ప్రాంతం. సీఎం గోదావరి జలాలతో మా ప్రాం తంలో పంటలు పండేలా చేశా రు. ఇక్కడ రైస్ మిల్లు అవసరం ఉన్నదని అలోచన జేసినం. ఇచ్చిన డబ్బులతో మరికొంత మందికి బతుకు దెరువుచూపుమని సీఎం కేసీఆర్ జెపుతుండ్రు. రైస్ మిల్లు అయితే.. మాతోపాటు మరో 30, 40 మందికి ఉపాధి జూపవచ్చు. అందుకే మిల్లును ఎంచుకున్నం. తప్పకుండా నడిపి చూపిస్తం.
– సుధమల్ల రాజేశ్వరీ, దళితబంధు లబ్ధిదారురాలు