హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఖమ్మంలో వెలుగుచూసిన నకిలీ పాస్పోర్టుల వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దృష్టి సారించనున్నట్టు తెలిసింది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి, ఆధార్కార్డు, పాస్పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను ఖమ్మం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు త్వరలోనే ఎన్ఐఏ అధికారులు ఖమ్మంలో సోదాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. నలుగురు బంగ్లాదేశీయులైన మొహమ్మద్ నూర్ నబీ అలియాస్ షేక్ నూర్ నబీ, మొహమ్మద్ సాగర్ అలియాస్ బోడ సాగర్, షేక్ జమీర్ అలియాస్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ అమినూర్ మండ ల్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నేండ్లుగా బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన కొందరు రోహింగ్యాలు దేశంలోకి అక్రమంగా ప్రవేశించి.. భారతీయులను పెండ్లి చేసుకొని అక్కడే స్థిరపడుతున్నారని ఎన్ఐఏ సోదాల్లో గుర్తించింది. ఆదివారం మయన్మార్కు చెందిన ముగ్గురిపై ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది.