హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో వెలుగు చూసిన సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని పుణె జిల్లా జున్నార్, గుజరాత్లోని ఖేడా జిల్లా నడియాద్, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం, బీహార్లోని గోపాల్గంజ్, ఢిల్లీలో ఈ సోదాలు జరిగాయి. సైబర్ ఉగ్రవాద కుట్ర ఆరోపణలకు సంబంధించి అహ్మదాబాద్లో 2025లో కేసు నమోదైంది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 54 వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక డీడీవోఎస్ దాడులకు నిందితులు యత్నించారు. దేశంలోని కీలక కంప్యూటర్ వనరులు, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సీఐఐ)పై ప్రభావం చూపడంతో పాటు దేశ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతను దెబ్బతీయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులకు ప్రయత్నించినట్టు ఎన్ఐఏ పేరొన్నది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక విశ్లేషణ చేపట్టిన ఎన్ఐఏ, అరస్టైన నిందితులకు డీడీవోఎస్ దాడులకు పాల్పడేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఇతర సహాయ సహకారాలు అందించినట్టు అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించింది.
కోర్టు నుంచి సెర్చ్వారెంట్లు పొందిన అనంతరం సోమవారం అనుమానితుల నివాసాలు, సంబంధిత ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. సోదాల్లో 3 ల్యాప్టాప్లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లు సహా ఇతర డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. ఈ కేసులో భాగంగానే గుజరాత్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం రామగుండం అయోధ్యనగర్లోని ముజామిల్ఖాన్ను విచారించారు. వచ్చే నెల 15న సికింద్రాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు అందజేశారు.