హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్చార్సీ) గట్టి షాకిచ్చింది. గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ మానసహిల్స్ మైనింగ్ వ్యవహారంలో కేంద్రస్థాయిలో విచారణ జరుపాలని ఆదేశించింది. ఈ మైనింగ్ వ్యవహారంపై రెండునెలల్లోగా చర్యలు చేపట్టాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీచేసింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్హెచ్చార్సీ ఈ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో తీసుకొన్న చర్యలపై న్యాయవాది రామారావుకు సమాచారం ఇవ్వాలని స్పష్టంచేసింది.
ఈ మేరకు న్యాయవాది రామారావు ఇమ్మానేనికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ అధికారిక సమాచారం పంపింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మానసహిల్స్ ప్రాంతంలో పర్యావరణ, గనులు, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని రామారావు ఈ ఏడాది మార్చిలో జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర గనుల శాఖను ఎన్హెచ్చార్సీ ఆదేశించింది. ఎలాంటి అనుమతులు లేకపోయినా మైనింగ్ వ్యవహారంపై అధికారులు మౌనంగా ఉండటంపై ఎన్హెచ్చార్సీ ప్రశ్నించింది. ఎనిమిది వారాల్లోగా పూర్తి నివేదికను రూపొందించి తమకు అందజేయాలని ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించింది.