హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మానవ తప్పిదాలు, కర్బన ఉద్గారాల కారణంగానే పర్యావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పేర్కొంది. దేశంలో వాతావరణం, ఉష్ణోగ్రతల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఎన్జీఆర్ఐ దశాబ్దకాలంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలను అన్వేషించింది. ఒకప్పుడు సౌర వ్యవస్థలో కలిగే మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు ప్రభావితమైతే, ఇప్పుడు మానవ తప్పిదాల కారణంగా వాతావరణం, గ్రీన్ హౌస్ వాయువుల వలన ఉష్ణోగ్రతలు మార్పు చెందుతున్నాయని తెలిపింది. దేశంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలను ఎన్జీఆర్ఐ విశ్లేషించింది. 1901-1957, 1978-2015 మధ్య పెరిగిన ఉష్ణోగ్రతల తీరును పరిశీలించగా, సౌర వ్యవస్థలో కలిగిన మార్పులు, వాతావరణంలో పెరిగిన గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని పరిశోధకులు గమనించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలను పరిశీలించగా కార్బన్ డయాక్సైడ్ ద్వారా భూ ఆవరణం చల్లబడటం ఆలస్యమవుతున్నదని వెల్లడైంది.
పదేండ్లలో పెరిగిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
గడిచిన పదేండ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినట్టు ఎన్జీఆర్ఐ అధ్యయనంలో తేలింది. 2017 వరకు సోలార్ ఇన్సొలేషన్ డాటాను పరిశీలించగా సౌర వ్యవస్థలోని ఆవర్తనం ప్రభావం ఉన్నదని వెల్లడైంది. కార్బన్ డయాక్సైడ్ దీర్ఘకాలిక ప్రభావం ఉష్ణోగ్రతలపై ఎక్కువగా ఉండగా, సముద్ర వాతావరణం ప్రభావం స్వల్పకాలికంగా ఉన్నదని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో కలుగుతున్న మార్పులను అధ్యయనం చేసేందుకు ఎన్జీఆర్ఐ తొలిసారిగా ప్రయత్నించింది. సౌర వైవిధ్యం, దశాబ్దకాలంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్టు.. ఏటా 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల వరకు మారుతున్నట్టు తేల్చారు.