TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. కోస్తాంధ్రను ఆనుకొని తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అదే సమయంలో కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా గ్రామాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 25 వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గడిచి 24 గంటల్లో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, హన్మకొండ, ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదైంది.