హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అందరూ ఊపిరిపీల్చుకొంటున్న వేళ మరో అలజడి మొదలైంది. మన దేశంలో పెద్దగా కేసుల ప్రభావం లేకపోయినా చైనా, బ్రిటన్ దేశాలను ‘ఎక్స్ఈ’ అనే కొత్త వేరియంట్ వణికిస్తున్నది. ఎక్స్ఈ అనేది ఒమిక్రాన్కు సబ్ వేరియంట్గా వైద్యనిపుణులు చెప్తున్నారు. మొదటి, రెండు, మూడు వేవ్లను పరిశీలిస్తే తొలుత విదేశాల్లోనే విజృంభించాయి. తరువాత మన దేశంలో దుమారం రేపాయి. ఈ క్రమంలో ఎక్స్ఈ వేరియంట్ ప్రభావంపై మళ్లీ ఆందోళన మొదలైంది.
కొత్త వేరియంట్ తప్పనిసరి
జూన్ లేదా జూలై నాటికి కొత్త వేరియంట్ కచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేవ్లా వస్తే కేసులు రోజులో వందల నుంచి వేల సంఖ్యలో నమోదవుతాయని, వేరియంట్లా వస్తే తక్కువ వ్యాప్తితో తగ్గుతుందని పేర్కొంటున్నారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఆందోళన అవసరం లేదు
ప్రస్తుతం విదేశాల్లో విజృంభిస్తున్న వేరియంట్ థర్డ్వేవ్లో మన దగ్గరకు వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే. చైనా, బ్రిటన్ దేశాల్లో ఆలస్యంగా వ్యాపిస్తున్నది. వైరస్ అనేది నిరంతరం మ్యుటేషన్ చెందుతూ ఉంటుంది. దీంతో కొత్త వేరియంట్లు తప్పవు. ఒక్కో వేరియంట్ రావటానికి ఆరు నెలల సమయం పడుతున్నట్టు తెలుస్తున్నది. రాబోయే వేరియంట్ ప్రభావం ఇప్పుడే చెప్పలేం. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 ఏండ్ల వయస్సు పిల్లల నుంచి వృద్ధుల వరకు టీకా అందుబాటులోకి వచ్చింది. దాదాపు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేట్ అయ్యారు. ఎలాంటి వేరియంట్ వచ్చినా తట్టుకొనే రోగ నిరోధక శక్తి ప్రజల్లోకి దాదాపు వచ్చేసింది. – డాక్టర్ రాజారావు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్