హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జేఎన్టీయూ తరహాలో మరో కొత్త సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతున్నది. దీనికి తెలంగాణ టెక్నాలజికల్ యూనివర్సిటీ (టీటీయూ) అనే పేరును అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలు, కోస్గిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, ఖమ్మం జిల్లా మధిరలో ఏర్పాటు చేసే కాలేజీ సహా త్వరలో వచ్చే మరో 11 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు ఈ వర్సిటీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఈ వర్సిటీ ఏర్పాటుపై సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఓ దఫా చర్చలు జరిపారు. ఈ కసరత్తు కొలిక్కి రాగా, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ సమీపిస్తుండటం, ఏఐసీటీఈ అనుమతుల ప్రక్రియ ముగియడంతో తర్జనభర్జనపడుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో వీలుపడని పక్షంలో వచ్చే విద్యాసంవత్సరంలోనై నా ఈ వర్సిటీని ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న సాంకేతిక విద్యామండలి స్థానంలో కొత్త వర్సిటీని ఏర్పాటుచేస్తారు. ఈ వర్సిటీని మాసబ్ట్యాంక్ లేదా హైదరాబాద్లోని మరో చోట ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
జీటీయూపైనా అధ్యయనం
గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జీటీయూ)ను 2007లో ఏర్పాటు చేశారు. ఈ వర్సిటీ పరిధిలో 486 కాలేజీలున్నాయి. ఈ వర్సిటీలో డిప్లొమా, బీటెక్, పీజీ, పీహెచ్డీ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇటీవలే గుజరాత్ వెళ్లిన రాష్ట్ర అధికారులు అక్కడి స్కిల్ వర్సిటీలతోపాటు గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీపైనా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే మన దగ్గర తెలంగాణ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఓ నివేదికను సిద్ధం చేశారు.