హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు కొత్త సీట్లు కేటాయించారు. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు కూర్చొనే సీట్లలో బీఆర్ఎస్ ఎంపీలకు రెండో వరుసలో స్పీకర్ ఓం బిర్లా సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఈ నెల 9న పార్లమెంట్ సర్క్యులర్ జారీ అయ్యింది. దీని ప్రకారం లోక్సభలో 12 శాతం లేదా 66 మంది ఎంపీలకు కొత్తగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రుల్లో 35 మందికి కొత్తగా సీట్లు కేటాయించారు.
చాలా మంది యువ ఎంపీలు, మంత్రుల సీట్లను అప్గ్రేడ్ చేశారు. లోక్సభ సెమీ సర్కిల్లో 6 బ్లాకుల సీట్లతో సర్దుబాటు చేశారు. ప్రతి బ్లాక్లో 11 అడ్డు వరుసలు ఉన్నాయి. మొదటి బ్లాక్లో 97, రెండవ బ్లాక్లో 87, మూడవ బ్లాక్లో 89, నాలుగో బ్లాక్లో 89, ఐదో బ్లాక్లో 89, ఆరో బ్లాక్లో 97 మందికి కలిపి మొత్తం 550 మందికి సీట్లు కేటాయించినట్టు పార్లమెంట్ సర్క్యులర్ పేర్కొన్నది. ఇదేవిధంగా రాజ్యసభలోనూ సీట్ల సర్దుబాటుకు కసరత్తు పూర్తయింది. సీట్ల కేటాయింపులను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమయ్యే వరకు ఈ కేటాయింపులే వర్తించే అవకాశమున్నట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
లోక్సభలో బీజేపీ ఎంపీలకు నాలుగు బ్లాకులు కేటాయించారు. ప్రధాని మోదీతోపాటు మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్షాకు మొదటి బ్లాక్లోని మొదటి వరుసలో సీట్లు కేటాయించారు. వారి తర్వాత అర్జున్ ముండాతోపాటు మిగిలిన మంత్రులకూ మొదటి బ్లాక్లోనే సీట్లు కేటాయించారు.