హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : డ్రైవింగ్ లైసెన్స్ జారీకి కేంద్రప్రభుత్వం ఇటీవల సరికొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ను జారీ చేసే విధంగా చట్టాలు మార్చింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సదుపాయాలు ఉన్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.
ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్కి కనీసం 3 ఎకరాల స్థలం, ట్రైనర్లకు హైస్కూల్ విద్య, డ్రైవింగ్లో ఐదేండ్ల అనుభవం కచ్చితంగా ఉండాలి. కాగా ఈ రూల్స్ ప్రకారం..లైట్ వెహికల్స్కు 29 గంటలు, హెవీ వెహికల్స్కు 39 గంటల శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని, ఆ తర్వాతే వారికి టెస్ట్ ద్వారా లైసెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లోని ఆర్డీవో కార్యాలయంలో మాత్రమే ఈ లైసెన్స్ను పొందుతున్న విషయం తెలిసిందే.