హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్లు, కల్వర్టుల మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి. 126 ప్రాం తాల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరో 175 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులన్నీ పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. వర్షాల వల్ల రోడ్లు, కల్వర్టులకు భారీగా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో వాటి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 1,187 చోట్ల రోడ్లు, కల్వర్టుల మరమ్మతులను గుర్తించిన రోడ్లు, భవనాల శాఖ, రోడ్ల కోసం రూ.1,823.40 కోట్లు, కల్వర్టులకు రూ.544.40 కోట్లు కలుపుకొని మొత్తం రూ.2,367.80 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించింది. గత జనవరిలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా, 776 పనులకు టెండర్లు దాఖలయ్యాయి. అందులో 301 పనులు చేపట్టగా, 126 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 175 చోట్ల పనులు చురుకుగా సాగుతున్నాయి.
411 పనుల కోసం రీటెండర్లు పిలిచిన అధికారులు, ఈ నెలాఖరుకల్లా ఈ పనులను కూడా చేపట్టాలని సంకల్పించారు. అలాగే, పనులన్నీ మే నెలాఖరులోగా పూర్తిచేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లడంతో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తాత్కాలికంగా పనులు నిర్వహించిన ఆర్అండ్బీ శాఖ ఇప్పుడు శాశ్వత మరమ్మతు చర్యలు చేపట్టింది. ఇటీవల రోడ్ల పరిస్థితిపై మంత్రితోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పూర్తిస్థాయిలో మరమ్మతుచేసి ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు.
ఎన్ని నిధులైనా వెనుకాడకుండా వెంటనే అంచనాలు రూపొందించి పనులు చేపట్టాలని చెప్తూ రూ.2500 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే అధికారులు మరమ్మతు పనులకు ఉపక్రమించారు. రోడ్ల మరమ్మతు పనులు ప్రాధాన్యక్రమంలో చేపడుతున్నట్టు, ముందుగా అధికంగా ట్రాఫిక్ ఉండే రోడ్లు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతోపాటు మండలాలను జిల్లా కేంద్రాలతో కలిపే రోడ్లను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని నిర్ణయించారు.