New Voter Number | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గతంలో జారీ చేసిన ఓటర్ కార్డులకు కొత్త నెంబర్లను కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఓటర్లకు లేఖ రాసింది. రాష్ట్రంలో దశాబ్దం క్రితం వరకు జారీ చేసిన ఓటరు కార్డులు 47 లక్షల వరకు ఉన్నాయని గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఓటరు కార్డు నెంబర్లు ఒకేలా ఉండేలా నంబర్లలో మార్పులు చేశారు.
దీనితో రాష్ట్రంలో అలాంటి కార్డులు 47 లక్షలు ఉన్నాయని తేల్చారు. రాష్ట్రంలో 14 నెంబర్లతో కార్డులు జారీ అయ్యాయి. మొదట ఏపీ అనే ఇంగ్లీషు నంబర్ ఉంటుంది. 12 డిజిటల్ నంబర్లు ఉంటాయి. వీటి స్థానంలో కొత్తగా మొదటి మూడు ఇంగ్లీషు అక్షరాలు 7 అంకెలతో నంబర్ కేటాయించారు. పాత కార్డు నెంబర్తో ఓటు వెతికితే వివరాలు లభ్యం కావు. ఈ నేపథ్యంలో ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 47 లక్షల మందికి ఎన్నికల సంఘం లేఖ రాసింది.
ఓటరు పూర్తి వివరాలు పాత కార్డు నంబర్తోపాటు కొత్తగా కేటాయించిన ఓటర్ కార్డు నంబర్ను లేఖలో పేర్కొన్నారు. కొత్త నంబర్తోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 47 లక్షల లేఖల్లో కొందరు చనిపోవడం, అక్కడ ఉండకపోవడం లాంటివి వాటితో దాదాపుగా 50 వేల లేఖలు తిరిగి ఎన్నికల సంఘానికి వచ్చాయని తెలిసింది.