IIT Madras | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చేయా లి. ఇంజినీర్ కావాలంటే బీటెక్ చదవాలి. కానీ, ఇంజినీరింగ్ ప్లస్ మెడికల్ కోర్సుల మేళవింపుతో సరికొత్త నాలుగేండ్ల బీఎస్ డిగ్రీ కోర్సును ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్నది. బీఎస్ మెడికల్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ కామకోటి తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేస్తే సగం డాక్టర్ అయిపోయినట్టేనని ఆయన వెల్లడించారు. వైద్య రంగంలో రోబోలు, ఇతర సాంకేతిక వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ కోర్సుకు రూపకల్పన చేశామని, ఇప్పటివరకు 26 వేల మంది ఈ కోర్సులో చేరారని వివరించారు. 15 ఏండ్లలో మన దేశం నుంచి ఒక నోబెల్ గ్రహీతను తయారుచేయడమే లక్ష్యంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఐఐటీహెచ్లో నిర్వహిస్తున్న ‘ఇన్వెంటివ్ -2024’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన ప్రత్యేకంగా ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘ఏ కోర్సుల్లో చేరితే ఏం ప్రయోజనాలుంటాయో తెలియకుండానే చాలా మంది కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. తీరా చేరాక వాటితో ప్రయోజనముండదని గ్రహించి బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఐఐటీ మద్రాస్లో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టాం. డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐదో సెమిస్టర్ తర్వాత విద్యార్థులు ఈ కోర్సులు తీసుకోవచ్చు’ అని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు.
‘ఐఐటీ మద్రాస్లో అంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యేకంగా సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఐడియాతో వస్తే స్టార్టప్లుగా ఎదిగేందుకు కావాల్సిన మార్గదర్శనాన్ని ఈ సెంటర్ అందిస్తుంది. స్టార్టప్ల కంపెనీలకు పేటెంట్స్ చాలా ముఖ్యం. రోజుకు ఒక పేటెంట్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 366 పేటెంట్స్కు దరఖాస్తు చేశాం. ఇప్పటికే 100 పేటెంట్స్ జారీ అయ్యాయి. ఈ 100 స్టార్టప్స్ ఆంత్రప్రెన్యూర్స్గా ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.
గ్రామీణ విద్యార్థుల అండగా ఉండేందుకు సామాజిక బాధ్యతగా గ్రామాల్లో రూరల్ ఇం టరాక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు ఆన్లైన్ ట్యూషన్లు చెప్పడం వీటి ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు 210 కేంద్రాల ను తమిళనాడులో 100, యూపీలో 100, శ్రీలంకలో 10 చొప్పున ఏర్పాటుచేశాం. రా బోయే రోజుల్లో కర్ణాటక, ఏపీ, తెలంగాణలో నూ ఏర్పాటు చేస్తాం. ఈ సెంటర్లల్లో టీవీ, కెమెరా, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నాం. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ యాలజీ సబ్జెక్టుల్లో సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో వలంటీర్లు, పూర్వ విద్యార్థులు, ఫ్యా కల్టీ ఆన్లైన్ ద్వారా హాజరై విద్యార్థుల సందేహాలు తీరుస్తారు. ఉన్నత విద్యలో అవకాశాల ను వారికి వివరిస్తారు. ఓవర్సీస్ క్యాంపస్ల ఏర్పాటులో భాగంగా టాంజానియాలో ఐఐ టీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు చేశాం. చాలా దేశాలు వీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి’ అని కామకోటి పేర్కొన్నారు.
క్రీడాకారులు, ఆటలను ప్రోత్సహించటంలో భాగంగా ఐఐటీ మద్రాస్లో కొత్తగా స్పోర్ట్స్ కోటాను అమలుచేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నాం. 2024-25 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కోటాను అమలుచేస్తాం. దేశంలోని ఏ ఐఐటీలోనూ ఈ తరహా విధానం అమల్లో లేదు. 10 సీట్లకు ఒక సీట్ను స్పోర్ట్స్ కోటా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీంతో ఒక్కో కోర్సులో ఒకరిద్దరు చేరే అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో 20-30 సీట్లను క్రీడాకారులకు కేటాయిస్తాం’ అని పేర్కొన్నారు.