హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): అత్యంత విలువైన వృక్షాలను స్మగ్లర్ల బారి నుంచి రక్షించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. సీటీఐవోటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ‘రియల్టైం ప్రొటెక్షన్ చిప్’ పరికరాన్ని శుక్రవారం సంస్థ వైస్చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీ చంద్రశేఖర్రెడ్డి ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా బొటానికల్ గార్డెన్లోని 50 మొక్కలకు ఈ పరికరాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. 3.6 వాల్ట్స్ బ్యాటరీతో పనిచేసే ఈ పరికరం మొబైల్ అప్లికేషన్స్, క్లౌడ్సర్వర్తో అనుసంధానమై ఉంటుంది. దీంతో చెట్లను ఎవరైనా నరుకుతున్నా, పెకిలించేందుకు ప్రయత్నించినా ఆ క్షణంలోనే అలెర్ట్స్ని మొబైల్ అప్లికేషన్కు, వాట్సాప్కి పంపిస్తుంది. ఈ పరికరం వల్ల చందనం, ఎర్ర చందనం వంటి విలువైన వృక్షాలను పెంచే రైతులకు కూడా చాలా మేలు జరుగుతుందని సీటీఐవోటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సత్యనారాయణ చొప్పదండి తెలిపారు.