న్యూఢిల్లీ: బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుమార్లు నిర్వహించేలా ‘కొత్త కరికులమ్ ఫ్రేమ్వర్క్’ (ఎన్సీఎఫ్)ను కేంద్ర విద్యాశాఖ రూపొందించింది. 9, 10 తరగతులకు.. తప్పనిసరి లాంగ్వేజ్ సబ్జెక్టుల సంఖ్యను మూడుకు పెంచింది. అలాగే ఇంటర్ విద్యార్థులు రెండు లాంగ్వేజ్ సబ్జెక్టులను తప్పనిసరిగా అభ్యసించాలని ‘ఎన్సీఎఫ్’ డాక్యుమెంట్లో పేర్కొన్నది. నూతన విద్యా విధానానికి (ఎన్ఈపీ)కి అనుగుణంగా 2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తామని కేంద్రం వెల్లడించింది. అలాగే కనీస సబ్జెక్టుల సంఖ్య పెంచుతున్నట్టు ప్రకటించింది.
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎన్సీఎఫ్ డాక్యుమెంట్’ను ‘ఎన్సీఈఆర్టీ’కి బుధవారం అందజేశారు. 11, 12 తరగతులలోని సబ్జెక్టుల ఎంపిక కేవలం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి గ్రూపులకు మాత్రమే పరిమితం కాదని కేంద్ర విద్యాశాఖ పేర్కొన్నది. ఏడాదిలో రెండుమార్లు పరీక్షలు నిర్వహించటం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతోపాటు వారి స్కోర్ను మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభిస్తుందని విద్యాశాఖ పేర్కొన్నది. ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్, అకడమిక్ విభాగాల్లో కరికులమ్, ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్లో పెద్దగా తేడాలుండవని వివరించింది. ఎన్సీఎఫ్ ప్రకారం..9, 10 తరగతుల్లో తప్పనిసరి సబ్జెక్టుల సంఖ్య ఏడుకు, ఇంటర్లో ఆరుకు పెంచింది.