6,551 మంది డిశ్చార్జి
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త కేసుల కన్నా డిశ్చార్జీలు అధికంగా నమోదవుతుండటం ఊరట కలిగిస్తున్నది. బుధవారం రాష్ట్రంలో 79,824 నమూనాలను పరీక్షించగా, 6,026 మందికి పాజిటివ్గా తేలింది. ఇదే సమయంలో 6,551 మంది డిశ్చార్జి అయినట్టు గురువారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 83.24 శాతానికి చేరగా, జాతీయ సగటు 82 శాతంగా నమోదైంది. కరోనాతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 52 మంది మరణించారు. బుధవారం అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,115, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 418, రంగారెడ్డిలో 403, నల్లగొండలో 368, సంగారెడ్డిలో 235, సిద్దిపేటలో 231, వరంగల్ అర్బన్లో 224, కరీంనగర్లో 223, నాగర్కర్నూల్లో 206, ఖమ్మంలో 205, మహబూబ్నగర్లో 204 కేసులు వెలుగుచూశాయి.
టీకాలు 50 లక్షలకు చేరువలో..
రాష్ట్రంలో బుధవారం 78 వేల మందికి టీకాలు వేశారు. ఇందులో 48 వేల మంది మొదటి డోస్ తీసుకోగా, 30 వేల మంది రెండోడోస్ తీసుకున్నట్టు గురువారం వైద్యారోగ్యశాఖ తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 49.59 లక్షల మందికి టీకాలు వేసినట్టు వివరించింది.