Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు గల విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారా? ఇవ్వరా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే గడువులోగా ఇవ్వడం కష్టంగానే కనిపిస్తున్నది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారు సాధించిన మార్కులను ఇప్పటివరకు ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడమే ఇందుకు కారణం. దీనిని సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ.. విద్యా సంవత్సరం త్వరలో ముగుస్తుందని, ఈ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చింది. నిరుడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం 40 వేలకు పైగా ట్యాబ్లను పంపిణీ చేసినా మార్కుల ఎంట్రీ జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విద్యార్థులకు నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహించారు. రెండో సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నెల 23న విద్యా సంవత్సరం చివరి పనిదినం కావడంతో అదేరోజు విద్యార్థులందరికీ ఆన్లైన్ ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వాల్సి ఉన్నది. విద్యార్థుల మార్కులను schooledu. telangana. gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఆటోమెటిక్గా ఆన్లైన్ ప్రోగ్రెస్ రిపోర్టులు జనరేట్ అవుతాయి. వీటిని డౌన్లోడ్ చేసి ఈ నెల 23న విద్యార్థులకు అందజేయాల్సి ఉన్నది. కానీ ఆన్లైన్లో మార్కుల ఎంట్రీ జరగనేలేదు. దీంతో ఆన్లైన్ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.