హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొవిడ్ కారణంగా రెండేండ్ల తర్వాత ఈ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రుల కోలాహలం కనిపించింది. ఆల్ ది బెస్ట్లతో సందడి వాతావరణం నెలకొన్నది. సోమవారం మొదటిభాష పేపర్కు పరీక్ష నిర్వహించారు. దీనికి 99 శాతం విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్ష సాఫీగా సాగిందని తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు పరీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో వినియోగించడం ఇదే తొలిసారి. పరీక్షలు పూర్తయిన తర్వాత భానుడి భగభగలతో విద్యార్థులు కాస్త ఇబ్బంది పడ్డారు.
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు..
కొండమల్లేపల్లి: తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షకు హాజరైంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఇడుకోడు లలిత మల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్నది. సోమవారం తెల్లవారుజామున ఆమె తండ్రి పురుషోత్తమాచారి అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ దవాఖానలో మృతిచెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. తొలి రోజు పదో తరగతి పరీక్షకు హాజరైంది. కన్నీళ్లు పెట్టుకొని పరీక్ష రాయడం పలువురిని కలచివేసింది.
అంబులెన్స్లో వచ్చి పరీక్ష రాసి..
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బకాల్వాడీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి అంబులెన్స్లో వచ్చి పరీక్ష రాశాడు. రవీంద్రభారతి పాఠశాలకు చెందిన బీ గౌతమ్ వారం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుముకు, కాలుకు శస్త్ర చికిత్స చేశారు. టెన్త్ పరీక్షలు రాయాలనే ఉద్దేశంతో అంబులెన్స్లో పరీక్ష కేంద్రానికి వచ్చాడు. ఈ విషయాన్ని ఎంఈవో బాలాజీనాయక్ డీఈవో భిక్షపతి దృష్టికి తీసుకెళ్లగా.. పరీక్ష హాల్ ముందు అంబులెన్సులోనే పరీక్ష రాయడానికి అనుమతించారు. అక్కడ ప్రత్యేకంగా ఇన్విజిలేటర్ను ఏర్పాటు చేశారు.