పెద్దపల్లి, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/మంథని రూరల్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, సుందిళ్ల బరాజ్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఉదయం అన్నారం, ఆ తరువాత సుందిళ్ల బరాజ్ను పరిశీలించారు. అన్నారం బరాజ్ పనులు ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పటికి పూర్తయ్యాయి? మొదట సీపేజ్లు ఎప్పుడు ఏర్పడ్డాయి? వాటిని ఎలా పూడ్చారు? అని బృందం సభ్యులు ఇంజనీర్లను అడిగినట్టు తెలిసింది. బరాజ్లో 2021లో మొదట సీపేజ్లు ఏర్పడితే కెమికల్తో గ్రౌటింగ్ చేసినట్టు ఇంజనీర్లు వారికి వివరించారు. బరాజ్ 4వ బ్లాక్లో 38వ, బ్లాక్ 3లో 38వ, 28వ వద్ద సీపేజ్లు పడ్డాయని తెలిపారు. వాటిని హిమాచల్ప్రదేశ్ నుంచి తెచ్చిన కెమికల్తో గ్రౌటింగ్ చేశామని చెప్పారు.
అనంతరం వారు గోదావరి నదిని పరిశీలించారు. అక్కడినుంచి బరాజ్ డౌన్ స్ట్రీమ్కు వెళ్లి సీపేజ్లు ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా మధ్యాహ్నం 2.40 గంటలకు సుందిళ్ల బరాజ్కు చేరుకున్నారు. బరాజ్ విస్తీర్ణం, పిల్లర్లు, రేడియల్ గేట్లు, నిర్మాణం గురించి ఇంజినీర్లను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ లాంటి 19 అంశాలను పరిశీలించారు. సాయం త్రం 5.15 గంటల దాకా అక్కడే ఉండి క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు సేకరించారు. మొత్తంగా బరాజ్ నిర్మాణంపై సంతృ ప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ బృందం లో పవర్ రిసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సైంటిస్ట్ యూసీ విద్యార్థి, సీడబ్ల్యూసీ బీసీడీ, డైరెక్టర్ శివకుమార్, రాహుల్ కుమార్ ఉన్నారు.