ఎస్సారెస్పీ దిగువన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ సమీపంలో గోదావరి తీరాన ఉన్న సాంబయ్య ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురు స్వాములను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం రక్షించింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో వరదలో చిక్కుకున్న 9మందిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోటపల్లి మండలం దేవులవాడ సమీపంలోని పంప్హౌస్లో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు రక్షించారు. కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖనర్గాం వెళ్లేమార్గంలోని దుబ్బగూడెం వద్ద రెండువాగుల మధ్యలో చిక్కుకున్న 40మందిని ఒడ్డు కు చేర్చారు. పెంచికల్పేట్, దహెగాం మండలాల పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన వద్ద 9 మంది కార్మికులను ట్యూబులు, తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్కాపూర్ శివారులోని వరద నీటిలో చిక్కుకున్న ఇటుక బట్టీల కార్మికులను సింగరేణి రెస్క్యూటీం, పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వయంగా రంగంలోకి దిగి రక్షించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలోని గౌతమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నివసించే మూడు అర్చక కుటుంబాలు, మత్స్యకారులు, భక్తులు 33 మందిని సింగరేణి ఆర్జీ-2కు చెందిన రెస్క్యూ టీంను కాపాడింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సమీపంలోని మగ్ధుంపుర వాగు సమీపంలో చిక్కుకున్న నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన గర్భిణిని గ్రామ యువకులు వాగు దాటించారు.