హైదరాబాద్, సెపెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, త్వరలోనే 12 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటంతో చాలా రాష్ర్టాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో మాస్క్లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నా.. కొన్ని విషయాల పట్ల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, అమెరికా, ఐరోపా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరిగిన నేపథ్యంలో మన దేశంలో స్కూళ్లు పునఃప్రారంభించడంపై లోకల్ సర్కిల్స్ సంస్థ తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో బోధిస్తున్నారని, ఆ గదుల్లోనే పిల్లలు భోజనం చేస్తున్నారని, అందరూ ఒకేచోట గుంపుగా చేరుతున్నారని పలువురు పేర్కొన్నారు. పిల్లలు మాస్క్ ధరిస్తున్నా సామాజిక దూరం పాటించడం లేదని, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 38వేల మంది పాల్గొన్నారు. ‘మీ పిల్లలు వెళ్లే పాఠశాలల్లో ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు?’ అంటూ వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. 84 శాతం మంది మాస్కింగ్ బాగుందని సమాధానం ఇచ్చారు. 70శాతం పాఠశాలల్లో సామాజిక దూరం, మరో 72శాతం పరిశుభ్రత, శానిటేషన్ బాగుందన్నారు. మాస్క్లు ధరించడానికి స్కూళ్లు అధికప్రాధాన్యం ఇస్తున్నాయని ఎక్కువ మంది తల్లిదండ్రులు చెప్పారు. సామాజిక దూరం, పరిశుభ్రత, శానిటేషన్ ఇంకా మెరుగుపడాలని అందరూ అభిప్రాయపడ్డారు. భోజనాలు, ఉదయం ప్రార్థనలను ఔట్డోర్లోనే నిర్వహించాలని మెజారిటీ తల్లిదండ్రులు కోరుకున్నారు.