హైదరాబాద్ : దేశంలోని సెల్ఫోన్ వినియోగదారులంతా ( Mobile phone users ) శనివారం అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ( NDMA ) సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటనను జారీ చేసింది. దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ (Cell Broadcast Alert System) పై పరీక్ష నిర్వహించనున్నందున తమ తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించింది .
ఈ పరీక్ష ఢిల్లీ , అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను కవర్ చేయనుందని తెలిపింది. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఈ పరీక్షకు మినహాయింపు ఉంటుందని వివరించింది. ఈ పరీక్ష సమయంలో పౌరులు ఫోన్లో అలర్ట్ గట్టిగా శబ్దం , వైబ్రేషన్తో రావచ్చని స్పష్టం చేసింది. వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు పంపబడే పరీక్ష సందేశం మాత్రమేనని, ఎటువంటి అత్యవసర పరిస్థితికి కాదని తెలియజేసింది.
అలర్ట్ అందుకున్నప్పుడు ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని,
ప్రశాంతంగా ఉండాలని, భయపడ వద్దని,గందరగోళానికి గురి కావొద్దని కోరింది. అత్యవసర పరిస్థితులలో ముఖ్యమైన సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడానికి , కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారని తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, ఎమర్జెన్సీ , సివిల్ డిఫెన్స్ శాఖ పీఆర్వో వి. ధనుంజయ రెడ్డి వెల్లడించారు.