హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ 16వ అఖిల భారత పోలీసు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (Badminton Championship) పోటీలకు ఆతిథ్యమిస్తోందని డీజీపీ రవి గుప్తా (DGP Ravi Gupta) వెల్లడించారు. ఈ మేరకు బుధవారం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అదనపు డీజీపీలు అభిలాషా బిస్త్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, విక్రమ్ సింగ్ మాన్, స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజీపీ ఎం రమేశ్, డీసీపీ శ్రీబాల తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 440 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారని వెల్లడించారు. ఈ టోర్నమెంట్లో 24 జట్లు పోటీపడతాయని వివరించారు. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగే ఈ పోటీల్లో సుమారు 745 మ్యాచులు జరగనున్నాయని పేర్కొన్నారు.