కరీంనగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు మరోసారి జాతీయ ఖ్యాతి దక్కింది. ఉత్తమ సేవలందించిన సహకార బ్యాంకులకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ (నాఫ్స్కాబ్) ఏటా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు అందిస్తున్నది. ఇందులో కేడీసీసీబీ మొదటి స్థానంలో నిలిచింది. కేడీసీసీబీకి అవార్డు రావడంతో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు హర్షం వ్యక్తంచేశారు. ఈ నెల 25న ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగే నాఫ్స్కాబ్ వార్షికోత్సవంలో ఈ అవార్డు అందుకోనున్నారు. కాగా, కేడీసీసీబీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఇది ఐదోసారి. జిల్లాలోని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బెస్ట్ పర్ఫార్మెన్స్లో మూడో స్థానంలో నిలిచింది.